శ్రీమతి డాక్టర్ ఇందిరానాథ్ (వైద్య శాస్త్రవేత్త)
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం లోని
బ్రాహ్మన కోడూరు అనే ఒక చిన్న గ్రామము నుండి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వైద్యురాలిగా ఎదిగిన మహిళా మాణిక్యం డాక్టర్ ఇందిరానాథ్.
వెంకటరావు నాగరత్నమ్మ లకు 1938 జనవరి 14 న జన్మించిన ఈమె వైద్య విద్యను 1963లో న్యూఢిల్లీలోనిAIIMSలో పూర్తి చేశారు.
అనంతరం 1963 నుండి 1967 వరకు లండన్ లోని వివిధ వైద్యశాలలలో పలు పదవుల్లో పనిచేశారు. 1967లో భారతదేశం తిరిగి వచ్చి AIIMS లోని
బయోటెక్నాలజీలో ఆచార్యులుగా చేరారు. అప్పటికింకా వైద్య శాస్త్రం లో మరింత లోతులు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆమెలో చావలేదు.
అందువల్లనే 1983లో లండన్ లో M.R.C.P
(Membership of The Royal Colleges of physicians of The Kingdom)
లో pathology పట్టా పొందింది.
పెథాలజీ అభ్యసించుట వలన వ్యక్తిలోని తీవ్ర అనారోగ్య సమస్యలకు గల కారణాన్ని ముందస్తుగానే సులభంగా గుర్తించవచ్చు.
ఈమె తన నిరంతర పరిశోధనల వల్ల వ్యక్తిలో ముందుగానే కుష్టు వ్యాధి లక్షణాలను గుర్తించగలిగారు.
ఈ విషయంలో ఎంతో మంది వైద్య పరిశోధకులకు ఈ మార్గ దర్శకత్వం వహించారు.
అలాగే లెప్రా బాలిల్లి వ్యాధిని సూక్ష్మదర్శిని ద్వారా గుర్తించగలిగే విధానాన్ని కూడా వివరించారు. వంశపారంపర్యంగా వచ్చే శోషరసకణముల
అసాధారణ అభివృద్ధిపై పరిశోధించి వాటి పనితీరును వెల్లడించారు.
ఎంతో మంది వైద్య పరిశోధకులు సాధించలేని వ్యాధి మూల నివారణను కనుగొన్నారీమె.
వ్యక్తులలో కుష్టు వ్యాధి బయటపడక ముందే దాని మూలాలను కనుగొని నశింప చేయడం వల్ల చాలా వరకు ఈ వ్యాధి నిర్మూలనకు తోడ్పడ్డారీమే. ఫలితంగా భారతదేశంలో కుఘ్ట వ్యాధి వ్యాపించకుండా తనవంతు కృషి చేసింది ఇందిరా నాథ్.
ఈమె కుష్టు వ్యాధిపై విస్తృతమైన పరిశోధన చేశారు.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) లో ఆచార్యులుగా కొనసాగిన కాలంలో కేవలం కుఘ్ట వ్యాధి మీద మాత్రమే కాక వ్యాధినిరోధక ప్రక్రియపై కూడా విస్తృతమైన పరిశోధన చేశారామె.
కేవలం వైద్య రంగంలో చేసిన పరిశోధనలతో తృప్తి చెందక వైద్యరంగంలో వెల్లడైన నూతన ఆవిష్కరణలను ప్రపంచం ముందుంచటంలో సఫలీకృతమయ్యారు. అందుకు ఆమె
"ఇండియన్ జర్నల్ ఆఫ్ లెప్రసీ"
"ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇమ్యూనిటీ"
వంటి ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శాస్త్ర సాంకేతిక పత్రికలకు సంపాదకురాలిగా వ్యవహరించారు.
అంతే కాదు "ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్" వారి ప్రచురణల సంపాదక మండలి చైర్ పర్సన్ గారు వ్యవహరించటం ఆమె ప్రతిభకు తార్కాణం.
వైద్య పరిశోధనా రంగంలో ఆమె చేసిన విప్లవాత్మక కృషికి నిదర్శనంగా పలు ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థల్లో గౌరవ పదవులు చేపట్టారు. వాటి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
వ్యాధి నిరోధక శాస్త్రం అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఆమె వైద్యుడైన తన భర్తతో కలిసి 1986లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) లో బయోటెక్నాలజీ విభాగాన్ని స్థాపించి అభివృద్ధి పరిచారు. అందులో ఎంతో మంది శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చారు.
1963లో ప్రారంభమైన ఈ వైద్య శాస్త్రం పయనం అంచలంచలుగా ఎదిగి ప్రపంచ స్థాయికి చేరింది. ఎన్నో నూతన ఆవిష్కరణలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పరంపరలో ఎన్నో పురస్కారాలు ఆమెను వరించి గౌరవించబడ్డాయి.
అందులో ప్రధానంగా
1983లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
1985లో క్షణీక ఓరేషన్ అవార్డు.
1999లో పద్మశ్రీ అవార్డు (వ్యాధి నిరోధక శాస్త్రం లో జరిగిన కృషికి)
ఇవి కాక మరెన్నో పేరెన్నికగన్న పురస్కారాలు , గౌరవాలు పొందారు.
తెలుగుజాతి ఔన్నత్యాన్ని వైద్యరంగంలో విశ్వవ్యాప్తం చేసిన మహిళా శక్తి డాక్టర్ ఇందిరా నాథ్.